ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రతిపాదించి చరిత్ర సృష్టించారు. ఈ బడ్జెట్ ఎన్నో విశేషాల సమాహారంగా ఉంది. బిజెపి అధికారాన్ని కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న రెండు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ఒకింత జనాకర్షకంగా ఉంటుందని భావించిన వారికి నిరాశ తప్పలేదు. ఆమె సొంత రాష్ర్టం తమిళనాడుతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. తమిళనాడుకు చెందిన చేనేత శక్తికి చిహ్నంగా ఆమె కంచీవరం సిల్క్ చీర కట్టుకుని స్వరాష్ర్టం పట్ల అభిమానం చాటుకున్నారు. మోదీ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పని చేసిన ఆర్థిక మంత్రి ఆమె.
- బడ్జెట్ తయారీలో "జనాకర్షణ కాదు...జననాడే ప్రధానం" అన్న మంత్రాన్ని తాను అనుసరించానని ఆమె ప్రకటించారు. అందుకు దీటుగానే 85 నిముషాల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులు లేదా ఆశ్చర్యపరిచే అంశాలు లేవు.
- "వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026లో ప్రధానమంత్రికి యువత నుంచి అనేక ఇన్నోవేటివ్ ఐడియాలు వచ్చాయి. వాటిలోని పలు ఐడియాలే ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు స్ఫూర్తి. అందువల్ల ఇది పూర్తిగా యువశక్తి చోదక బడ్జెట్" అని నిర్మల అన్నారు.
- పేదలు, సమాజంలో నిరాదరణకు, నిరాకరణకు గురవుతున్న వర్గాల సంక్షేమమే నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పం అని ఆమె నొక్కి చెప్పారు. బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదు.
- ఆమె గతంలో ప్రతిపాదించిన బడ్జెట్ల తరహాలో తమిళ నానుడులేవీ లేవు. ఈ సారి ఏ భాషకు చెందిన నానుడులకైనా దూరంగా ఉండాలని ఆవిడ భావించినట్టున్నారు.
- నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారంభించిన కర్తవ్య భవన్లో తయారైన ఈ తొలి బడ్జెట్ మూడు సంకల్పాలను ప్రకటించింది. ఇంతకు ముందు బడ్జెట్లన్నీ రాష్ర్టపతి భవన్ సమీపంలోని నార్త్బ్లాక్లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో తయారయ్యేవి.
- బడ్జెట్ ప్రకటించిన మూడు సంకల్పాలు...సుస్థిర ఆర్థిక వృద్ధిలో వేగం పెంపు, ఆకాంక్షల సాధన-సామర్థ్యాల నిర్మాణం, సబ్ కా సాత్-సబ్ కా వికాస్. ఈ ఏడాది బడ్జెట్ అంతా ఈ మూడు సంకల్పాల సిద్ధికే అంకితం అయింది.
మోదీ సారథ్యంలోని మా ప్రభుత్వం "మాటలు కాదు...కార్యాచరణ, సంస్కరణ, ప్రజా ప్రయోజనాలకే నిర్ణయాత్మకంగా పెద్దపీట వేసింది" అని నిర్మల బడ్జెట్ ప్రారంభంలో ప్రకటించారు.
"దేశంలో నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులున్నారు. వారు బకాయిలన్నీ చెల్లించి వివాదాలకు తెర దించాలనుకుంటున్నారు. కాని పెనాల్టీ అన్న వ్యతిరేక భావంతో వారందరూ ముందుకు రావడంలేదు. ఇప్పుడు వారు పెనాల్టీకి బదులుగా అదనంగా కొంత సొమ్ము చెల్లించడం ద్వారా కేసుల నుంచి విముక్తులు కావచ్చు" అన్న ప్రకటనతో జైహింద్ అంటూ ఆమె బడ్జెట్ ప్రసంగం ముగించారు.
