Friday, August 20, 2021

8 నెల‌లు-6000

2021లో సెన్సెక్స్ ప్ర‌యాణం


భార‌త స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల సూచీ సెన్సెక్స్ 2021 సంవ‌త్స‌రంలో అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ దూసుకుపోతోంది. ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో రికార్డులు న‌మోదు చేసింది. జ‌న‌వ‌రిలో తొలిసారిగా 50000 శిఖ‌రం అధిరోహించిన సెన్సెక్స్ ఆగ‌స్టు 18న 56000 శిఖ‌రం దాటింది. కాని లాభాపేక్ష అమ్మ‌కాల‌తో ఆ శిఖ‌రం నుంచి స్వ‌ల్పంగా దిగువ‌న క్లోజ‌యినా ఈ 8 నెల‌ల కాలంలో సెన్సెక్స్ ఎక్కిన మెట్లు 6. అమిత ఆశావ‌హ దృక్ప‌థం క‌ల‌వారిని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచే ప‌రుగుగా దీన్ని విశ్లేష‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి 2020 మార్చిలో సెన్సెక్స్ క‌రోనా దెబ్బ‌తో 8828 పాయింట్లు క్షీణించింది. కాని అంత‌లోనే 2021 సంవ‌త్స‌రంలో అనూహ్య‌మైన ర్యాలీలో పురోగ‌మిస్తోంది. ఇంత ర్యాలీ క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ప‌రుగు మాత్రం తీవ్ర‌మైన ఒడిదుడుకుల‌తోనే సాగింద‌ని, ఇన్వెస్ట‌ర్లు, ట్రేడ‌ర్లు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జియోజిత్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్  స్ర్టాట‌జిస్ట్ వి.కె.విజ‌య‌కుమార్ హెచ్చ‌రిస్తున్నారు. అంతే కాదు...కొత్త రిటైల్ ఇన్వెస్ట‌ర్లే ఈ ప‌రుగుకు అండ‌గా నిలిచార‌ని, ప్ర‌స్తుతం ఓవ‌ర్ బాట్ స్థితిలో ప‌డింది. 3 నెల‌ల పాటు తీవ్ర ఒత్తిడికి గురైన అనంత‌రం మార్కెట్ లో ఈ ప‌రిణామం ఏర్ప‌డింది. 


కీల‌క మైలురాళ్లివే...

2021 జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని దాటింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

చారిత్ర‌క‌మైన ఈ ప‌రుగుతో ఆగ‌స్టు 18వ తేదీ నాటికి బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి రూ.2,42,08,041.64 కోట్లను దాటింది. 

సెన్సెక్స్ ఆవిర్భావం - దేశంలోని తొలి స్టాక్ ఎక్స్ఛేంజి సెన్సెక్స్. 1986లో దీన్ని ప్రారంభించారు. 1990 జ‌న‌వ‌రి 25న సెన్సెక్స్ తొలిసారిగా 1000 పాయింట్ల మైలురాయిని దాటింది. 2006 ఫిబ్ర‌వ‌రి 7న 10,000 పాయింట్ల జీవిత కాల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. 


ప‌బ్లిక్ ఇష్యూల హ‌వా

స్టాక్ మార్కెట్ లో ప‌బ్లిక్ ఇష్యూల (ఐపిఓ) జోరు సాగుతోంది. ఒక్క 2021 ఆగ‌స్టు తొలి 20 రోజుల కాలంలోనే రూ.40 వేల కోట్ల విలువ గ‌ల 23 ఇష్యూల జారీకి అనుమ‌తి కోరుతూ ద‌ర‌ఖాస్తులు సెబీలో దాఖ‌ల‌య్యాయి. మ‌రోప‌క్క ఇప్ప‌టివ‌ర‌కు ఈ 20 రోజుల కాలంలోనే స్టాక్ మార్కెట్ నుంచి రూ.18,200 కోట్లు స‌మీక‌రించారు. ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు 40 కొత్త కంపెనీలు లిస్టింగ్ అయి రూ.70 వేల కోట్ల‌కు పైగా స‌మీక‌రించాయి. ఇష్యూల‌కు రిటైల్ ఇన్వెస్ట‌ర్లు అధికంగా ఆక‌ర్షితుల‌వుతున్నారు. ప్ర‌తీ ఇష్యూ కూడా 100 రెట్లు పైబ‌డి ఓవ‌ర్ స‌బ్ స్క్రిప్ష‌న్ సాధిస్తున్నాయి. ఈ జోరు చూస్తుంటే ఈ ఏడాది ఇష్యూల సంఖ్య 100 దాట‌వ‌చ్చున‌ని, 2021 ఐపిఓల సంవ‌త్స‌రంగా పేరు గ‌డించ‌వ‌చ్చున‌ని బ్రోక‌రేజి సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి. 


No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...