Saturday, September 14, 2013

INDIA IN INTENSIVE CARE

ఇంటెన్సివ్ కేర్ లో ఇండియా
భారత ఆర్థిక వ్యవస్థ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నదన్న విషయం ప్రధాని ఆర్ధిక సలహా మండలి తాజాగా వెలువరించిన నివేదక వెల్లడిస్తోంది... ఆర్ధిక రంగం ఈ ఏడాది 5.3 శాతం మించిన వృద్ధి సాధించలేదని ఆ నివేదిక తేల్చి చెప్పింది... ఇప్పటికే మన కేంద్ర బ్యాంకు అర్ బి ఐ, పలు అంతర్జాతీయ ఏజెన్సీ లు వృద్ధి రేటు అంచనాలను 5 శాతం అంత కన్నా తక్కువకి కుదించినా ఈ వృద్ధ ఆర్థికవేత్తల కూటమిలో ఇంకా ఆశలు చావలేదు... పాపం ఇప్పటికీ మనం 5.3 శాతం వృద్ధి సాధిస్తామని నమ్మబలుకుతున్నారు...గత ఏడాది కూడా వారి అంచనాల తీరు ఇలాగే ఉంది... అందరూ ఐదు శాతానికి అటూ ఇటూ అంటూంటే ఈ కూటమి మాత్రం ఆరు శాతానికి దగ్గరలో ఉంటామని చివరి వరకు నమ్మబలికింది... కానీ చివరికి మనం సాధించింది ఐదు శాతమే. అది ఒక దశాబ్ది కనిష్ట స్థాయి...తాజా పరిస్థితి అంత కన్నా దారుణంగా ఉంది... దేశం యవత్తును నిస్సత్తువ ఆవరించి ఉంది... ఏ రంగంలోనూ ఉత్సాహం లేదు... పారిశ్రామిక రంగం పూర్తిగా చతికిలబడింది... ఎగుమతులు దారుణంగా పడిపోయి దిగుమతుల భారం మాత్రం తగ్గకపోవడంతో కరెంటు ఖాతా లోటు కొండలా పేరుకుపోయింది... సబ్సిడీ ల భారం కారణంగా విత్త లోటు కూడా దారుణంగా పెరిగిపోయింది... వీటన్నింటి ప్రభావం వల్ల మన కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ విపణిలో అన్ని కరెన్సీలతోనూ దారుణంగా క్షీణించింది... ఆర్థిక వ్యవస్థలో కనీ వినీ ఎరుగని మందగమనం కారణంగా ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయాయి... ధరల కాటుతో అల్లాడుతున్న సగటు జీవి కొనుగోలు శక్తి పడిపోవడం పారిశ్రామిక రంగాన్ని కుంగదీసింది... ఓ పక్క కొనుగోళ్ళు లేక పడిపోయిన ఉత్పత్తి, మరో పక్క వడ్డీ రెట్ల భారం పారిశ్రామిక రంగానికి ద్వంద్వ ఆఘాతంగా పరిణమించింది...ఈ వాస్తవాలన్నీ విస్మరించి ప్రస్తుత మందగమనానికి అర్ బి ఐ అనుసరించిన కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయ పరిస్థితులే కారణమని నిందించడం ప్రభుత్వ పెద్దలకి పరిపాటిగా మారింది... ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఒక్కటే శరణం అని పిఎంఇఏసి అనే ఈ కూటమి తాజా నివేదికలో తేల్చనే తేల్చింది...ఓ పక్క ప్రభుత్వ పెద్దలు వడ్డీ రేట్లు తగ్గించాలంటూ అర్ బి ఐ పై వత్తిడి తెస్తుంటే ఈ కూటమి పెద్ద రంగరాజన్ మాత్రం రూపాయి స్థిరపడే వరకు ద్రవ్య విధానంలో కఠిన వైఖరి కొనసాగించాలని అర్ బి ఐకి సంకేతం ఇచ్చారు... ప్రభుత్వానికి. దాని సలహాదారులకి మధ్య పొంతన లేదనడానికి ఈ నివేదికే నిదర్సనం... వాస్తవాలను విస్మరించి ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి అవకాశాలు అంతరించి పోలేదన్న భ్రమల్లో కాలం గడుపుతూ పొతే ఈ ఏడాది వృద్ధి రేటులో మరో కనిష్ట స్థాయి నమోదు కావడం ఖాయం... వాస్తవానికి పిఎంఇఏసి అనేది ఆర్ధిక వేత్తల ముసుగులో పునరావాసం పొందుతున్న కొందరు మాజీ బ్యూరోక్రాట్ల వేదికగా ఉంది... రానున్న ప్రమాదాలను గుర్తించడంలో ఇది పూర్తిగా విఫలమయిందనడానికి గత కొద్ది సంవత్సరాలుగా వెలువడుతున్న అంచనాలే తార్కాణం... 

No comments:

Post a Comment

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...