Monday, March 30, 2020

మార్కెట్‌ మళ్ళీ అథోముఖం

1375 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభించ‌డంతో పాటు భార‌త్ లో కూడా కోవిడ్‌-19 కేసులు పెరుగుతూ ఉండ‌డం ఇన్వెస్ట‌ర్ల‌ను క‌ల‌త‌కు గురి చేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్, ఆటో కౌంట‌ర్ల‌లో అమ్మ‌కాలు హోరెత్త‌డంతో మార్కెట్ ఇండెక్స్ లు భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి. ఒక వారం రోజుల ర్యాలీ అనంత‌రం మార్కెట్లు మ‌రోసారి డౌన్ ట్రెండ్‌లో ప్ర‌వేశించాయి. దీనికి తోడు ప‌లు రేటింగ్ ఏజెన్సీలు భార‌త వృద్ధిరేటును ప్ర‌స్తుత సంక్షోభం నేప‌థ్యంలో గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డంతో ఇన్వెస్ట‌ర్లు రిస్క్ గా భావించే షేర్ల‌ను భారీ ప‌రిమాణంలో వ‌దిలించుకున్నారు. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2 శాతానికి పైబ‌డి న‌ష్టాల‌తోనే ముగిశాయి. సెన్సెక్స్ 1375.27 పాయింట్ల న‌ష్టంతో 28440.32 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 379.1 5 పాయింట్ల న‌ష్టంతో 8281.10 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. అయితే నిఫ్టీకి దిగువ‌కు రివ‌ర్స‌ల్ బార్ ఏర్ప‌డ‌డం వ‌ల్ల మ‌రోసారి స్వ‌ల్ప‌కాలిక బ‌ల‌హీన‌త ఏర్ప‌డిన‌ట్టు విశ్లేష‌కులు చెబుతున్నారు.

రూ.3.35 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి
గ‌త వారంలో మూడు రోజుల విరామం మిన‌హా (24, 25, 26 తేదీలు) గ‌త శుక్ర‌వారం, తాజాగా సోమ‌వారం ఏర్ప‌డిన న‌ష్టాల‌తో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.3.35 ల‌క్ష‌ల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. సోమ‌వారం మార్కెట్ ముగిసే స‌మ‌యానికి బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,09,63,832.17 కోట్లకు దిగ‌జారింది. 

మార్చి 9 నుంచి 9 రోజుల వ్య‌వ‌ధిలో సంప‌ద న‌ష్టం
-------------------------------------------------------------------------  
                      సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
-------------------------------------------------------------------------   

మార్చి   9           1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12           2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16            2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17              811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 18           1709         495         రూ. 5.98 ల‌క్ష‌ల కోట్లు 
 మార్చి 19             581         206        రూ. 3.74 ల‌క్ష‌ల కోట్లు
మార్చి  23           3935        1135        రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 29, 30      1375          379        రూ.  3.35 ల‌క్ష‌ల కోట్లు      
మొత్తం నష్టం       14039        4025       రూ.74.82 ల‌క్ష‌ల కోట్లు   
------------------------------------------------------------------------- 

విదేశీ మార్కెట్ల‌కూ న‌ష్టాలే...
క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కూ విజృంభిస్తూ ఉండడం ఇన్వెస్ట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. దీంతో అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ముగిశాయి. షాంఘై, హాంకాంగ్‌, టోక్యో, సియోల్  మార్కెట్లు న‌ష్టాల్లో ముగియ‌గా యూరోపియ‌న్ మార్కెట్లు కూడా అదే బాట‌లో ఉన్నాయి.

ఆయిల్ ధ‌ర‌ల భారీ క్షీణ‌త‌
అంత‌ర్జాతీయ విప‌ణ‌లో క్రూడాయిల్ ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర 6.62% క్షీణించి బ్యారెల్‌ 23.28 డాల‌ర్ల‌కు దిగిరాగా వెస్ట్ టెక్సాస్ ఇంట‌ర్మీడియేట్ ఆయిల్ ధ‌ర 5 శాతం క్షీణించి బ్యారెల్ 20 శాతానికి వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా డిమాండు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో పాటు సౌదీ అరేబియా, ర‌ష్యా మ‌ధ్య‌న సాగుతున్న‌ధ‌ర‌ల పోరాటం కూడా క్రూడాయిల్ ధ‌ర‌ల భారీ క్షీణ‌త‌కు కార‌ణం. 



70 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి
స్టాక్ మార్కెట్, ఆయిల్ మార్కెట్ల‌కు దీటుగానే దేశీయ క‌రెన్సీ రూపాయి కూడా అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో భారీగా 70 పైస‌లు క్షీణించింది. ఈక్విటీ మార్కెట్ల‌లో అమ్మ‌కాలు పోటెత్త‌డం రూపాయి భారీ క్షీణ‌త‌కు కార‌ణం. ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి 75.17 వ‌ద్ద ప్రారంభ‌మై చివ‌రికి 70 పైస‌ల భారీ న‌ష్టంతో 75.59 వ‌ద్ద ముగిసింది.

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...